
తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజా ప్రతినిధుల నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించే ఏడీఆర్ శనివారం ఆసక్తికమైన నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎమ్మెల్యే నేరాలపై కీలక విషయాలను వెల్లడించింది.
తెలంగాణలోని 118మంది ఎమ్మెల్యేల్లో 72మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 46మందిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు ఉన్నట్లు వెల్లడించింది.
అధికార బీఆర్ఎస్కు చెందిన 101మంది ఎమ్మెల్యేలలో 59 మంది క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది స్థానాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఖాళీగా ఉంది.
ఎమ్మెల్యే సాయన్న మృతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అందుకే 118 మందిపై సర్వే చేసినట్లు ఏడీఆర్ చెప్పింది.
అసెంబ్లీ
ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, ఒకరిపై అత్యాచారం కేసు
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లు, ఆ తర్వాత నిర్వహించిన ఉప ఎన్నికల ఆధారంగా ఏడీఆర్ ఈ నేర విశ్లేషణ చేసింది.
ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నానికి సంబంధించిన కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్లో చెప్పారు.
నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్-376 కింద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదు కావడం గమనార్హం.
ఏఐఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు, కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.