Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ పీఠంపై తొలి దళిత స్పీకర్..బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త స్పీకర్'కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం అందించారు. ఈ క్రమంలోనే తెలంగాణ శాసనసభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ కుమార్ చరిత్ర లిఖించారు. ఇదే సమయంలో స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
సమాజంలోని ఎన్నో రుగ్మతలపై స్పీకర్ పరిష్కారం చూపాలి : సీఎం
స్పీకర్ ఎన్నికపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సభలో మంచి సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. సభాపతి ఎన్నికపై సానుకూలంగా వ్యవహరించిన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్'లోనూ ఇదే సాంప్రదాయం కొనసాగాలన్నారు. తనది, స్పీకర్'ది సొంత జిల్లా వికారాబాదేనని గుర్తు చేశారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారని కొనియాడారు. సభలో చర్చలు ఫలప్రదమై సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. సమాజంలోని రుగ్మతలపై స్పీకర్ పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామన్నారు. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసించారు.