AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ .. పలు అంశాలపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఇందులో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. అలాగే పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడి ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ పర్యటనను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.