వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ
ఆదివాసీలు భారతదేశానికి అసలైన యజమానులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆదివాసీ వర్గాలను అడవులకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అంతేకాకుండా, ఆదివాసీలను 'వనవాసీ'లు పిలవాలని బీజేపీ చెబుతోందని రాహుల్ అన్నారు. 'వనవాసి' అనే పదం వెనుక ఒక దిక్కుమాలిన తర్కం ఉందన్నారు. 'వనవాసీ'లు పిలవడం అంటే భూమిపై వారికున్న యజమాని హోదాను లాక్కోవడమే అన్నారు. ఆదివాసీలను 'వనవాసి'లు అని పిలవడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. కేరళలోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వాయనాడ్లో డాక్టర్ అంబేద్కర్ జిల్లా స్మారక క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఆదివాసీల పేరు మార్చడం అంటే చరిత్రను వక్రీకరించడమే: రాహుల్
ఆదివాసీలను వనవాసి అని పిలవడం అంటే, వారి చరిత్ర, సంప్రదాయాలను వక్రీకరించడమే అని రాహుల్ గాంధీ అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది దేశంతో వారికి ఉన్న సంబంధాలను దెబ్బతీయడమే అన్నారు. ఇది ఏమాత్రం తమ పార్టీకి ఆమోదయోగ్యం కాదని రాహుల్ పేర్కొన్నారు. భూమికి యజమానులు ఆదివాసీలే కాంగ్రెస్ నమ్ముతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదివాసీలు పర్యావరణ పరిరక్షణ గురించి వేల ఏళ్లుగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. కాబట్టి ఆదివాసీల నుంచి తాము నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ కోతలతో వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులకు కొత్త విద్యుత్ కనెక్షన్తో పరిష్కారం లభిస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.