TSRTC బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్
బీఆర్ఎస్ సర్కారుకు గవర్నర్ తమిళ సై మళ్లీ షాకిచ్చింది. ఇటీవల వరద ప్రాంతాలను సందర్శించిన గవర్నర్ తమిళ సై ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలకున్న ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళ సై ఆమోదం తెలపకపోవడం గమనార్హం. మనీబిల్ కావడంతో ప్రభుత్వం గవర్నర్కు పంపింది. దీంతో గవర్నర్ అమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదురుచూస్తోంది. న్యాయ సలహాలు తీసుకొని సమస్యలు రాకుండా చూసుకునేందుకు ఆర్టీసీ విలీనం బిల్లు అనుమతికి సమయం కావాలని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. తనకు బిల్లు మొన్న మధ్యాహ్నం అందిందని, కొంత సమయం అవసరమని ఆమె పేర్కొన్నారు.
మండిపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు
గవర్నర్ కావాలనే ఈ బిల్లుపై స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఆర్టీసీ విలీన బిల్లు రేపు వస్తే, ఆదివారం కూడా సభ నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ రేపటి వరకు ఆమోదించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ సంస్థలో పనిచేస్తున్న 43373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ కొన్నింటికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడం వివాదానికి కారణమవుతోంది. మరోవైపు ఈ బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టడంపై ఆర్టీసీ ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.