Page Loader
Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!
కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!

Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా లాభం లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన సీఎం యోగి, మహాకుంభమేళా సనాతన ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించిందని వివరించారు. కుంభమేళా లాభాలు ఎలా ఉన్నాయంటే ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని, కుంభమేళా 45 రోజుల్లో ఆ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాన్ని అందుకుందన్నారు. అంటే ఒక్కో పడవ రూ.23 లక్షల లాభాన్ని సాధించిందని, రోజుకు సగటున రూ.50,000 నుంచి రూ.52,000 ఆదాయం వచ్చినట్లు వివరించారు.

Details

 కుంభమేళా భద్రతా వివరాలు 

ఈ మహాకుంభమేళాకు 45 రోజుల్లో 66 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని యోగి స్పష్టం చేశారు. ఒక్క తొక్కిసలాట ఘటన మినహా, మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్యల వంటి నేరాలు ఒక్కటీ నమోదు కాలేదని వెల్లడించారు. కుంభమేళా నిర్వహణ కోసం మొత్తం రూ.7,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఈ భారీ ఉత్సవం ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలిపారు.

Details

ఆర్థిక లాభాలు ఇవే

హోటల్‌ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం విరాళాల రూపంలో రూ.660 కోట్లు జాతీయ రహదారుల టోల్ ట్యాక్స్ ద్వారా రూ.300 కోట్లు ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం దేశ స్తూలజాతీయోత్పత్తిలో (GDP) కుంభమేళా తన వంతు వాటాను అందించిందని సీఎం యోగి పేర్కొన్నారు.