PM Modi: యోగాతో ప్రపంచం ఒక్కటైంది : ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'వయసుతోపాటు ఆరోగ్యానికి యోగా' అనే ఇతివృత్తంతో కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన భారీ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 35 వేల మంది యోగాసనాలు వేశారు. అలాగే కోల్కతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మంది యోగా చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, యోగాతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒకరికొకరు మరింత చేరువయ్యారని పేర్కొన్నారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, యోగా ఉత్సాహంతో దేశం మొత్తం నిండిపోయిందన్నారు.
వివరాలు
యోగాను ప్రతిరోజు సాధనగా మార్చుకోవాలి
యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది కొన్ని వయసుల వారికి మాత్రమే పరిమితమైన సాధన కూడా కాదని మోదీ స్పష్టం చేశారు. యోగా మానవ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలందరినీ ఏకం చేసే శక్తి దీనికి ఉందన్నారు. సమతుల్యమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతేకాకుండా, జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలను కూడా యోగా నేర్పిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అందువల్ల యోగాను కేవలం ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి రోజు సాధనగా మార్చుకుంటే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన సూచించారు.