Page Loader
Chandra Babu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక

Chandra Babu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎమ్మెల్యే మంచివాడన్న పేరు ఉంటేనే ఓట్లు పడతాయ్.. విమర్శలు వస్తే బూతుల దగ్గరికి వెళ్లకండి. బదులిచ్చే నైతిక బలం ఉండాలి. చేసిన పనులు చెబితే సరిపోదు.. చేయలేకపోయిన విషయాలూ ప్రజలకు చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలకు కొన్ని కీలక సూచనలు చేశారు. సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు, వారి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 56మంది ఆహ్వానితుల మధ్య 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటం విచారకరం. మీ నియోజకవర్గాలకు దూరంగా ఉంటే ప్రజలపై ప్రభావం చూపలేరు. తరచూ విదేశీ పర్యటనల పేరుతో దూరమవుతున్నవారికి ఇక అక్కడే ఉండడం మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Details

సమావేశానికి వచ్చినవారిపై ప్రత్యేక నజర్ 

సమావేశానికి ఉదయమే వచ్చినవారు, సంతకాలు పెట్టి మధ్యలో వెళ్లిపోయినవారు, చివరి వరకూ ఉన్నవారి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు చంద్రబాబు. "తానా, ఆటా వంటి సమావేశాలకు టికెట్లు బుక్ చేసుకున్నవారి వివరాలూ తెలుసు. నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభమైందనీ, మంత్రులూ నెలరోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండాలని నిర్ణయించామని వివరించారు.

Details

ఉదాసీనతకు తావు లేదు 

కొంతమంది ఎమ్మెల్యేలు పేరుకే పాపులర్‌ అయినా పనితీరు మాత్రం శూన్యమని విమర్శించారు. ఇకపై మొహమాటం లేదు. చెప్పాల్సినదే చెబుతున్నా. నేను ఇచ్చే సూచనలతో పనితీరు మార్చుకుంటే మళ్లీ గెలుస్తారు. లేకపోతే మీ ఇష్టమేనని స్పష్టం చేశారు. మూడుసార్లు బలహీనంగా ఉన్న బూత్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అక్కడ అధికంగా ప్రచారం చేస్తే ఫలితం ఉంటుందని సూచించారు. జనసేన-బీజేపీతో సమన్వయం కీలకం ఓటు బదిలీ విజయవంతమవ్వడానికి నేను, పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు కీలకమైంది. ప్రతి నాయకుడూ మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Details

లోకేశ్‌ పట్టుదల ప్రతి నాయకుడికీ పాఠం 

2019లో లోకేశ్‌ విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని చెప్పాను. కానీ తాను మంగళగిరిలోనే పోటీ చేస్తానన్నాడు. ఓటమి అనంతరం ఐదేళ్లూ అక్కడే కష్టపడ్డాడు. ఇప్పుడు రాష్ట్రంలో మూడో అతిపెద్ద మెజారిటీతో గెలిచారు. ఇదీ పట్టుదల ఉన్న నాయకుడి లక్షణమని అన్నారు.

Details

అప్పుడే వచ్చిన నాయకుల సలహాలు ఆశ్చర్యం కలిగించేవి 

కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు నాకే సలహాలు ఇస్తున్నారు. 'మీరు అలా చేయండి, ఇలా చేయండి' అంటున్నారు. ఇలాంటి అభిప్రాయాలన్నీ పనిచేసి రుజువు చేయాలి కానీ, మాటలతో కాదని చెప్పారు. రాబోయే 30 ఏళ్ల నాయకత్వాన్ని తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. యువతికి అవకాశం ఇచ్చాం.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్ని పార్టీల్లో నేతలు మారినా.. కార్యకర్తలు మాత్రం 45 ఏళ్లుగా జెండా మోస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండటానికి కారణం వారే. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉత్తమ కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని స్పష్టం చేశారు.