
Botsa Satyanarayana: 'నన్ను అంతం చేయాలని చూశారు'.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
శాసనమండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. పైడితల్లి పండుగలో తనను అవమానించాలనో, అంతమొందించాలనో కుట్ర జరిగిందా అని అధికారుల తీరుపై బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చాం, కానీ అది పట్టించుకోలేదు. ఇది కుట్రతో జరిగింది, లేక అధికారుల అలసత్వమా? మమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశమా, లేక అంతమొందించాలన్నదా?" అని ఆయన ప్రశ్నించారు. పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పండుగలో ప్రమాణాలు పాటించలేదని, సంప్రదాయాలను పక్కనబెట్టి అహంకారంతో వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు పైడితల్లి అమ్మవారు ఇలవేల్పుగా ఉన్నారన్నారు.
Details
అధికారుల తీరుపై ఆగ్రహం
ఏ రాజకీయ పార్టీ కూడా ఉత్సవాల సమయంలో రాజకీయాలను చేయదని, కానీ ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారులు సంప్రదాయాలను తుంచేసారని బొత్స పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ, ఎమ్మార్వో, ఎండీవో, ఎక్సైజ్ తదితర శాఖల్లో హుండీ పెట్టి డబ్బు సేకరించడం ఏ విధంగా సివిల్ సర్వెంట్లకు అనుగుణంగా ఉందని ఆయన ప్రశ్నించారు. "ఇది ధర్మమా?" అని ఆయన మళ్లీ ప్రశ్నించారు. అలాగే, తనకు ఏర్పాటు చేసిన స్టేజ్ కూలిపోయి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. ఈ సంఘటనపై గవర్నర్, ముఖ్యమంత్రి వద్ద లేఖ రాసే ఉద్దేశ్యముందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు, "ఇలాంటి పరిణామాలు ప్రభుత్వ అలసత్వం వల్ల, అధికారులపై ప్రభుత్వానికి పట్ట లేకపోవడం వల్లనే చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.