
Amit Shah: ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు ఎంతో దూరంలో లేవు: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ భాషలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో ఇంగ్లీషులో మాట్లాడేవారికి సిగ్గుపడే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
అలాంటి సమాజం ఏర్పడటానికి చాలా సమయం పట్టదని అభిప్రాయపడ్డారు.
భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే అంశాల్లో స్థానిక భాషలు ముఖ్యమైనవి అని పేర్కొన్నారు.
దేశీయ భాషలు లేకపోతే మనం నిజమైన భారతీయులం కాదని అన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
విదేశీ భాషల ఆధారంగా సంపూర్ణ భారతీయతను ఊహించలేం
''మన దేశంలో ఒక దశలో ఇంగ్లీషులో మాట్లాడడం గర్వంగా భావించేవారు. కానీ త్వరలోనే, ఆ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించుకునే రోజులు రావచ్చు. భారతీయ భాషలే భారతీయ సంస్కృతికి విలువైన నిధులు. అవి లేకపోతే మన భారతీయతను నిలుపుకోలేం. ఇప్పుడు దేశ భాషల గౌరవాన్ని తిరిగి పొందాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'' అని పిలుపునిచ్చారు.
విదేశీ భాషల ద్వారానే మన దేశమూ,సంస్కృతీ,మతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
దేశీయ సంస్కృతికి పూర్తి అర్థం వచ్చేందుకు పరాయి భాషలు ఉపయుక్తం కావని, విదేశీ భాషల ఆధారంగా సంపూర్ణ భారతీయతను ఊహించలేమని వివరించారు.
వివరాలు
అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ భాషలే మార్గదర్శకం
ఈ మార్పు సాధించటం అంత సులభం కాదని తనకు తెలుసని చెప్పారు. అయినప్పటికీ భారత సమాజం ఈ దిశగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
దేశానికి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ భాషలే మార్గదర్శకంగా నిలవగలవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ ఐఏఎస్ అధికారి అగ్నిహోత్రి కూడా, కేంద్ర సర్వీసు అధికారులకు అందించే శిక్షణా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.