నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్
ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన రాజ్యసభ సభ్యులకు ఆగస్టు 7, 8 తేదీల్లో సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. దిల్లీ బ్యూరోక్రసీపై ఎన్నుకోబడిన ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ బ్యూరోక్రసీ కేంద్రం పరిధిలోకి వచ్చేలా మోదీ ప్రభుత్వం వివాదాస్పదమైన ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లును తీసుకొస్తుంది. ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ఆప్కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం హాజరు కావాలని తమ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది.