LOADING...
Richest MPs: రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ అగ్రస్థానం
రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ అగ్రస్థానం

Richest MPs: రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ అగ్రస్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభ సభ్యుల ఆర్థిక స్థితి,నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదికలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దల సభలో భారీ ఆస్తులు కలిగిన ఎంపీలతో పాటు,క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 226 మంది సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఈ విశ్లేషణను రూపొందించారు. నివేదిక ప్రకారం,ఈ 226 మంది ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.26,047 కోట్లుగా నమోదైంది. ఒక్కో ఎంపీ సగటు ఆస్తి విలువ రూ.115 కోట్లకు పైగానే ఉంది. వీరిలో 31 మంది ఎంపీలు (14 శాతం) రూ.100 కోట్లకు మించిన ఆస్తులతో బిలియనీర్‌లుగా నిలిచారు.

వివరాలు 

6 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య

మరోవైపు కేవలం నలుగురు సభ్యులు మాత్రమే తమ ఆస్తుల విలువ రూ.20 లక్షల లోపే ఉందని ప్రకటించారు. ఆస్తుల పంపిణీని పరిశీలిస్తే.. సుమారు 100 మంది ఎంపీలకు రూ.10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. మరో 41 మంది సభ్యుల ఆస్తులు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉండగా, 66 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య నమోదైంది.

వివరాలు 

31 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు

ఆర్థిక వివరాలతో పాటు ఎంపీల నేర చరిత్రను కూడా ఏడీఆర్ విశ్లేషించింది. పరిశీలించిన 226 మంది సభ్యుల్లో 69 మంది (31 శాతం)పై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 36 మంది ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు. ఒక ఎంపీపై హత్య కేసు (సెక్షన్ 302) నమోదై ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం (సెక్షన్ 307) కేసులు ఉన్నాయి. అదనంగా మరో నలుగురు ఎంపీలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు కూడా నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఏ పార్టీకి ఎన్ని కేసులు?

పార్టీల వారీగా పరిశీలిస్తే.. బీజేపీకి చెందిన 107 మంది ఎంపీల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్‌కు చెందిన 29 మంది సభ్యుల్లో 12 మంది కేసులను ఎదుర్కొంటున్నారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీల్లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ఎంపీలపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 9 మందిలో ఇద్దరు, డీఎంకేకు చెందిన 8 మందిలో ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నలుగురిలో ఇద్దరు, సీపీఎంకు చెందిన ముగ్గురు సభ్యులందరిపై, ఆర్జేడీకి చెందిన ముగ్గురిలో ఇద్దరిపై కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

తెలంగాణ ఎంపీలదే అత్యధిక సంపద

రాష్ట్రాల వారీగా చూస్తే సంపద పరంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రానికి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లుగా నమోదైంది. వీరిలో నలుగురు బిలియనీర్‌లు ఉండటం విశేషం.వ్యక్తిగత ఆస్తుల పరంగా బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రూ.5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. అనంతరం పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజిందర్ గుప్తా రూ.5,053కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ రూ.2,558 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ కేవలం రూ.3.79 లక్షల ఆస్తితో అత్యల్ప ఆస్తులు ప్రకటించిన రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు.

వివరాలు 

భారీ ఆస్తులతో పాటు భారీ అప్పులు కూడా..

కొంతమంది ఎంపీలు భారీ ఆస్తులతో పాటు గణనీయమైన అప్పులను కూడా ప్రకటించినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పరిమళ్ నత్వానీ రూ.755 కోట్ల ఆస్తులతో పాటు రూ.256 కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ బి. రామకృష్ణ రూ.672 కోట్ల ఆస్తులు, రూ.200 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రూ.1,578 కోట్ల ఆస్తులతో పాటు రూ.149 కోట్లకు మించిన అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisement