Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో గత రెండు రోజులుగా అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కుండపోత వర్షం పడడంతో నగరంలోని అన్ని రోడ్లు నీట మునిగిపోయాయి. ఇక ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఈ విధంగా వర్షం కొనసాగితే, నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం
మరోవైపు, భారత వాతావరణ శాఖ (IMD) నేడు బెంగళూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల భద్రత కొరకు జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా, పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఇచ్చాయి.