త్రిపుర అసెంబ్లీ పోలింగ్: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటేస్తున్న ప్రజలు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. 28.14లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 60స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 259 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఎంలు అధికార బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల కోసం జట్టు కట్టాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్తో కలిసి పోటీ చేస్తోంది. అలాగే 2021లో రాజ వంశీయుడు ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మచే ప్రారంభించిన టిప్రా మోతా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
త్రిపురలో ఓటు హక్కును వినియోంగించుకుంటున్న ఓటర్లు
2023లో తొలి ఎన్నికలు- ముక్కోణపు పోటీ
బీజేపీ 55స్థానాల్లో, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. గోమతి జిల్లాలోని ఆంపినగర్ నియోజకవర్గంలో మిత్రపక్షాలైన బీజేపీ, ఐపీఎఫ్టీ తమ అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం. వామపక్షాలు 47, కాంగ్రెస్ 13స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2023లో ఎన్నికలు జరుగుతున్న తొలి రాష్ట్రం త్రిపుర కావడం గమనార్హం. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్నాయి. 2018కి ముందు త్రిపురలో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ, గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకుని 1978 నుంచి 35ఏళ్లపాటు పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ను గద్దె దించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు గెలుచుకుని 43.59 శాతం ఓట్లను సాధించింది. సీపీఐ (ఎం) 42.22 శాతం ఓట్లతో 16 సీట్లు గెలుచుకుంది.