LOADING...
ATS: 'మత విద్వేషాలు రెచ్చగొట్టే సాహిత్యం'నోయిడాలోని ఇస్తాంబుల్ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి 
'మత విద్వేషాలు రెచ్చగొట్టే సాహిత్యం'నోయిడాలోని ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి

ATS: 'మత విద్వేషాలు రెచ్చగొట్టే సాహిత్యం'నోయిడాలోని ఇస్తాంబుల్ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ పేలుడు కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డా. ఉమర్‌ నబీ, అలాగే ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు చెందిన డా. ముజమ్మిల్‌ గనాయీ 2021లో తుర్కియేకు వెళ్లి అక్కడ జైషే మహమ్మద్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుర్కియేతో సంబంధాలు ఉన్న సంస్థలను అధికారులు క్షుణ్ణంగా గమనిస్తుండగా, ఉత్తర ప్రదేశ్‌ ఏటీఎస్‌ గ్రేటర్‌ నోయిడాలోని ఇస్తాంబుల్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రింటింగ్ ప్రెస్‌పై సోదాలు జరిపింది.

వివరాలు 

కార్యాలయంలోని సీసీటీవీ రికార్డులు, వివిధ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం

సోదాల్లో ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌ మత విద్వేషాలను ప్రేరేపించే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు ఏటీఎస్‌ గుర్తించింది. కార్యాలయంలోని సీసీటీవీ రికార్డులు, వివిధ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. 2021లో ముజమ్మిల్‌ గనాయీ, ఉమర్‌ తుర్కియేకు వెళ్లిన సమయంలో ఉమర్‌ ఓ విదేశీ హ్యాండ్లర్‌ను కలిసినట్టు, అతడు భారతదేశంలో టెర్రర్ మాడ్యూల్‌ను ఎలా ఏర్పాటు చేయాలి, ఎలా నిర్వహించాలి అన్న వివరాలతో కూడిన సూచనలు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి, అవసరమైన వనరులను పొందడానికి తుర్కియేలోని నెట్‌వర్క్‌ల ద్వారా వారికి ఆర్థిక సహాయం అందినట్లు కూడా తెలిపారు. అందుకే తుర్కియేతో సంబంధాలున్న సంస్థలపై వరుస దాడులు కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు.

వివరాలు 

360 కిలోల అమోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ 

నిందితుల ప‌రిశీల‌నలో బయటపడిన వివరాల ప్రకారం.. తుర్కియే ప్రయాణం ముగిసిన తర్వాత డా. ముజమ్మిల్‌ గనాయీ, ఉమర్‌ భారీ మొత్తంలో రసాయనాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించడం ప్రారంభించారు. వీటిలో 360 కిలోల అమోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ వంటి పదార్థాలు ఉన్నాయి. ఈ రసాయనాలను ఎక్కువగా అల్‌ ఫలా యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో నిల్వ చేసినట్టు తేలింది. డిసెంబర్‌ 6 (బాబ్రీ మసీదు కూల్చివేత దినం) నాడు భారీ బాంబు దాడులు జరపాలని ఉమర్‌ నబీ ప్రణాళిక రూపొందించినట్టు దర్యాప్తు బృందం కనుగొంది. అయితే ఫరీదాబాద్‌ నెట్‌వర్క్‌ కుట్ర మధ్యలోనే బయటపడడంతో ఉమర్‌ ఆందోళనకు గురై, చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు సంభవించిందనే అనుమానం వ్యక్తమవుతోంది.

వివరాలు 

పేలుడుకు వారం ముందు ఫోన్‌ను సోదరుడికి ఇచ్చిన ఉమర్‌ 

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు వారం రోజుల ముందే ఉమర్‌ కశ్మీర్‌కు వెళ్లినట్లు దర్యాప్తు వివరాలు చెబుతున్నాయి. వెళ్లే ముందు తన మొబైల్‌ ఫోన్‌ను సోదరుడు జహూర్‌ వద్ద వదిలేసి వెళ్లాడని అధికారులు గుర్తించారు. విచారణలో జహూర్‌ తొలుత ఏమీ తెలియదని చెప్పినా, తరువాత ఉమర్‌ తన ఫోన్‌ను తనకు ఇచ్చినట్టు అంగీకరించాడు. మీడియాలో తనపై ఏదైనా వార్తలు వస్తే వెంటనే ఆ ఫోన్‌ను నీటిలో పడేయాలని ఉమర్‌ తనకు చెప్పినట్టు జహూర్‌ చేసిన ఒప్పుకోలు వెల్లడించాయి. ప్రస్తుతం అధికారులు ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.