
IMD Alert: వర్షాల బెడదతో ఉత్తరాఖండ్ అతలాకుతలం.. చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రస్థాయిలో కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలిన ఘటనతో మరింత విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో హోటల్లో మొత్తం 29 మంది ఉన్నారు. వారిలో 20 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసివచ్చారు.
Details
చార్ధామ్ యాత్రపై తాత్కాలిక బ్రేక్
ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న భారీ వర్షాల దృష్ట్యా చార్ధామ్ యాత్రను అధికారులు 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీ ప్రాంతాల్లో ఉన్న యాత్రికులను ముందుకు సాగనివ్వకుండా ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే వరకు ప్రయాణికుల ఆగమనాన్ని నిలిపివేసే అవకాశం ఉన్నదని వెల్లడించారు. సోమవారం వాతావరణంపై సమీక్ష అనంతరం తదుపరి చర్యలు ప్రకటించనున్నారు.
Details
జార్ఖండ్లో వరద భయం.. 162 విద్యార్థుల రక్షణ
జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ ఆశ్రమ పాఠశాల వరద నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో ఆ ఆశ్రమ పాఠశాలలో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సహాయంతో అధికారులు సురక్షితంగా బయటకు తరలించారు. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Details
భారీ వర్షాల సూచన.. రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ తదితర రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ యంత్రాంగం కూడా అత్యవసర ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించింది.