Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా మంచు చరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ దుర్ఘటనలో 55 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా, భారత ఆర్మీ ఇప్పటివరకు 50 మందిని రక్షించింది.
అయితే వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
జోషిమఠ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందగా, ఇంకా ఐదుగురిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటన బద్రీనాథ్కు సమీపంలోని ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం జరిగింది.
Details
హెలికాప్టర్ల సాయంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు
భారత్-టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం దేశానికి చెందిన చివరి గ్రామంగా గుర్తింపు పొందింది.
జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న సమయంలో సరిహద్దు రహదారుల సంస్థ (BRO) సిబ్బందిపై ఈ ప్రమాదం సంభవించింది.
సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో దట్టమైన మంచు వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
నిన్న 33 మందిని, ఈ రోజు 17 మందిని ఆర్మీ సురక్షితంగా కాపాడింది.
హెలికాప్టర్ల సహాయంతో గాయపడిన వారిని జోషిమఠ్లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భారత ఆర్మీ తెలిపింది.