సూరత్: పట్టపగలే బ్యాంకును దోచుకున్న దొంగలు; వీడియో వైరల్
బ్యాంకు దోచుకోవడం ఇంత సులభమా అనిపించే ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన, సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముఖాలకు హెల్మెట్ పెట్టుకుని కస్టమర్లలా బ్యాంకులోకి వచ్చిన దొంగలు, సరాసరి బ్యాంకు సిబ్బందికి పిస్టోల్ గురిపెట్టి, అందరినీ ఒక గదిలోకి పంపించివేసి తమకు కనిపించిన సొమ్మునంతా సంచిలో వేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది పోలీసులను పిలిచారు. బ్యాంకు మొత్తాన్ని పరిశీలించిన పోలీసులు 14లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్ళినట్లు కనుక్కున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన వీడియో ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ దొంగతనం వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.