
Vijay Rupani: ఎయిరిండియా ప్రమాదంలో విజయ్ రూపాణీ మృతి.. డీఎన్ఏతో గుర్తింపు!
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విజయ్ రూపాణీ మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు.
ప్రమాదం జరిగిన మూడు రోజుల అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షలు ద్వారా రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు.
కుటుంబ సభ్యుల నమూనాలతో చేసిన డీఎన్ఏ పరీక్షల్లో సరిపోవడంతో మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో మొత్తం 32 మంది మృతుల డీఎన్ఏ నమూనాలను వారి కుటుంబ సభ్యుల నమూనాలతో పోల్చి చూస్తున్నామన్నారు.
Details
మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఆలస్యం
ఇప్పటివరకు 14 మృతదేహాలను పరీక్షల ఆధారంగా గుర్తించి కుటుంబాలకు అప్పగించామని బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు.
మిగతా 8 మృతదేహాలను కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా గుర్తించడంతో పరీక్షల అవసరం లేకుండానే అప్పగించినట్లు పేర్కొన్నారు.
ప్రమాద తీవ్రత వల్ల ఎక్కువమంది శరీరాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి.
అందువల్ల డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఒక్కో పరీక్షకు సమయం ఎక్కువగా పడుతుండటంతో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.
బాధితుల కుటుంబాలను సకాలంలో సమాచారం అందించేందుకు 230 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రమాదంలో మృతి చెందిన 11 మంది విదేశీయుల కుటుంబాలకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు.