Page Loader
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ 
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు, గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్, ప్రాసిక్యూషన్‌ వాదనలకు అనుకూలంగా తీర్పునిస్తూ, వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌లకు రిమాండ్‌ విధించారు. అనంతరం, పోలీసులు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

వివరాలు 

వంశీ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు 

పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో వంశీపై కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ ప్రధాన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. మరణ భయంతోనే సత్యవర్ధన్‌ వంశీ అనుచరుల ఆదేశాలను పాటించాడని పోలీసులు తేల్చారు. పోలీసుల నివేదిక ప్రకారం, "వంశీకి నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా సీపీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడకు తరలించాం. ఈ కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశాడు. అలాగే, సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఏ7, ఏ8 నిందితులు కీలకంగా వ్యవహరించారు" అని పోలీసులు తెలిపారు.

వివరాలు 

అరెస్టు & విచారణ 

టీడీపీ కార్యాలయంలో పని చేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో, గురువారం ఉదయం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేశారు. వంశీ అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌లపై అట్రాసిటీ యాక్ట్‌ కింద నాన్-బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేయగా, లక్ష్మీపతి మరియు శివరామకృష్ణ ప్రసాద్‌లను విజయవాడలో అరెస్టు చేశారు. అంతేకాక, విజయవాడ పడమట పోలీస్‌ స్టేషన్‌లో సత్యవర్ధన్‌ వాగ్మూలం నమోదు చేశారు. అనంతరం వంశీని విజయవాడకు తరలించి, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. పోలీసు విచారణ అనంతరం, నిందితులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.