Page Loader
సంక్షిప్తం చేయు
Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న విశాఖ సాగరతీరం.. ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు 
ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు

Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న విశాఖ సాగరతీరం.. ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం బీచ్‌తీరమంతా వేడుకల ముంగిట ఆకర్షణీయంగా మారుతోంది.

రికార్డు స్థాయిలో ఐదు లక్షల మందికి పైగా పాల్గొనేలా యోగాసనాల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు మొత్తం 26 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేస్తూ, రహదారులపై ప్రత్యేక మ్యాట్‌లు, రాత్రి వేళల కోసం విద్యుదీపాల ఏర్పాటు, ఎల్ఈడి స్క్రీన్‌లు, యోగా శిక్షకులకు వేదికలు వంటి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

వర్షం వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రా యూనివర్సిటీలో వేదికను సిద్ధం చేస్తున్నారు.

జూన్‌ 21వ తేదీన ఉదయం 6.25 గంటలకు 'యోగాంధ్ర-2025' కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది.

వివరాలు 

విశాఖ చేరుకున్న గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌

ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు ముఖ్య అతిథులు ప్రసంగిస్తారు.

తొలుత కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి స్వాగతం పలకగా, ఆ తరువాత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తమ ప్రసంగాలు 6.45 నిమిషాల వరకు కొనసాగిస్తారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ 15 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.

ఉదయం 7 గంటలకు యోగాసనాల ప్రదర్శన ప్రారంభమై 7.45 వరకు కొనసాగనుంది.

గురువారం నాడు బీచ్‌రోడ్డులో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వాక్‌థాన్‌ నిర్వహించారు.

ఆ తరువాత వారు యోగాసనాలు చేసి వేడుకలకు శుభారంభం పలికారు.గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ గురువారం రాత్రి విశాఖ చేరుకుని, నోవాటెల్‌ హోటల్లో బస చేశారు.

వివరాలు 

ప్రధాని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రయాణ వివరాలు 

ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు.

అక్కడ స్వాగత కార్యక్రమాల అనంతరం 6.45 గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్‌ మెస్‌ అతిథిగృహానికి చేరుకుని రాత్రివేళ అక్కడే బస చేస్తారు.

జూన్‌ 21వ తేదీ ఉదయం 6 గంటలకు రోడ్ మార్గంలో బయలుదేరి 6.25 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు.

యోగా వేడుకల అనంతరం ఉదయం 7.50కి బయలుదేరి,8.15కి మళ్లీ నౌకాదళ అతిథిగృహానికి చేరుకుంటారు.

అనంతరం 11.25 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి,11.45కి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని,11.50కి దిల్లీకి బయలుదేరనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం 5.30కి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ఐఎన్‌ఎస్‌ డేగాకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలుకుతారు.

వివరాలు 

ప్రధాని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రయాణ వివరాలు 

రాత్రి కలెక్టరేట్‌లో బస చేసి,21వ తేదీ ఉదయం బీచ్‌రోడ్డులో నిర్వహించే యోగా వేడుకల్లో పాల్గొంటారు.

ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం మధ్యాహ్నం 12.40గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకుని, ప్రధాని స్వాగత కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

అనంతరం పోర్టు అతిథిగృహంలో బస చేస్తారు.21న యోగా వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు.

మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం ఉదయం 10గంటలకు విశాఖకు చేరుకుని నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి, యోగా వేడుకల ఏర్పాట్లను సమీక్షిస్తారు.

రాత్రి అక్కడే బస చేసి,21న యోగా కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత తిరిగి బయలుదేరుతారు.

వివరాలు 

విజేతలకు ప్రదర్శన అవకాశాలు 

ఈ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వయసులవారికి నిర్వహించిన పోటీల్లో 179 మంది విజేతలుగా నిలిచారు.

వీరంతా ఆర్కే బీచ్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శించనున్నారు.

గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌లో వేలాది మందితో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు.

జిల్లాలోని పోలీసు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సూర్య నమస్కార భంగిమల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.