
Modi-Putin: ఉగ్రవాదంపై పోరాటం భారత్కు రష్యా మరోసారి మద్దతు.. మోదీకి కాల్ చేసిన పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటానికి రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో వెల్లడించారు. "పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి మోదీతో ఫోన్ ద్వారా మాట్లాడారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై సాగుతున్న భారత పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు," అని జైస్వాల్ చెప్పారు.
వివరాలు
విక్టరీ డే సందర్భంగా పుతిన్కు,నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
ఈ దాడికి పాల్పడిన వారు, వారిని సహకరించినవారికి కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరముందని పుతిన్ అభిప్రాయపడ్డారని, రష్యా-భారత్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని కూడా ఆయన పేర్కొన్నట్లు జైస్వాల్ వివరించారు. ఈ సందర్భాన్ని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్కు విక్టరీ డే (విజయ దినోత్సవం) సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలి పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. దాడి అనంతరం మొదట్లోనే ఈ దారుణ ఘటనను పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషాద సమయంలో భారత్కు సంపూర్ణ మద్దతుగా ఉండబోతున్నామని ప్రకటించారు.
వివరాలు
దాడికి బాధ్యులైనవారికి తప్పకుండా శిక్షలు
ఈ మేరకు రష్యా అధ్యక్షుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక సంతాప సందేశాలు పంపారు. ఉగ్రవాద దాడులను సహించబోమని, ఈ దాడికి బాధ్యులైనవారికి తప్పకుండా శిక్షలు ఖాయం కావాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్తో సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పుతిన్, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.