భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. తిరుమల నడక మార్గంలో చిరుతపులి దాడిలో లక్షిత అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తల భద్రతపై బీజేపీ నేత భానుప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నడక మార్గంలో కంచె ఏర్పాటు చేయాలని భానుప్రకాష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తుల రక్షణలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని అటు టీటీడీకి, ఇటు అటవీ శాఖకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదికను అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా బాలిక లక్షిత కుటుంబానికి మరో రూ.15 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.