రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?
ఎప్పుడూ అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించే అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్ను వీడిన నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ చేసిన ఆ ట్వీట్కు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ రాహుల్పై బలమైన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి 'అవాంఛనీయ వ్యాపారవేత్తలను' కలుస్తున్నారని అన్నారు. గులాం నబీ ఆజాద్ చేసిన ఆరోణలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ వ్యాపారులు ఎవరు? అని బీజేపీ ప్రశ్నిస్తోంది.
అజాద్, కిరణ్ కుమార్ రెడ్డి, సిసోడియాను ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్
అదానీ కంపెనీల్లో రూ. 20,000 కోట్ల బినామీ డబ్బు ఎవరిది?: రాహుల్
ఇటీవలి సంవత్సరాల్లో కాంగ్రెస్ను విడిచిపెట్టిన కొంతమంది నాయకులను ప్రశ్నిస్తున్నట్లుగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వాళ్లు వాళ్ళు నిజాన్ని దాచిపెడతారని, అందుకే రోజూ తప్పుదోవ పట్టిస్తున్నారని, తన ప్రశ్న అలాగే ఉందని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. అదానీ కంపెనీల్లో రూ. 20,000 కోట్ల బినామీ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు. తన ట్వీట్లో గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిస్వా శర్మ, కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ ఆంటోనీ పేర్లను జత చేశారు.
దేశం బయట ఎవరిని కలుస్తాడో నాకు తెలుసు: ఆజాద్
రాహుల్ ట్వీట్లో తన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని, తనకు ఏ వ్యాపారితోనూ సంబంధం లేదని చెప్పారు. తనకు గాంధీ కుటుంబం అంటే చాలా గౌరవమని, అందుకే వారికి వ్యతరేకంగా ఏమీ మాట్లాడకూడదనుకుంటున్నాని వెల్లడించారు. అతను(రాహుల్) దేశం బయట అవాంఛనీయ వ్యాపారవేత్తలను ఎక్కడికి వెళ్లి కలుస్తాడో నేను ఉదాహరణలు చెబుతానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఇటీవల తన 'ఆత్మకథ' పుస్తకం విడుదల సందర్భంగా కాంగ్రెస్, రాహుల్పై గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ను 'బ్లూపర్స్ అండ్ బాంబాస్ట్'గా వర్ణించారు రాహుల్ గాంధీ వల్లే తనతో పాటు చాలా మంది నేతలు పార్టీని వీడారని అన్నారు.