Page Loader
Saifullah Khalid: పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?
పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?

Saifullah Khalid: పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం,ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాలేదు.ఈ దాడికి సంబంధించి టీఆర్‌ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్)అనే ఉగ్రవాద సంస్థ బాధ్యతను స్వీకరించింది. ఈ టీఆర్‌ఎఫ్ అనే సంస్థ పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది. జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో లష్కరే తోయిబా,టీఆర్‌ఎఫ్ నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాల వెనుక సైఫుల్లా ఖలీద్ అనే ఉగ్రవాది కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచార వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

హఫీజ్ సయీద్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు

ఈ దాడికి అతడే ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ 'ఆజ్‌తక్' వెల్లడించింది. ఆజ్‌తక్‌ తెలిపిన వివరాల ప్రకారం,లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సైఫుల్లా ఖలీద్‌ను 'సైఫుల్లా కసూరి' అనే పేరుతో కూడా పిలుస్తారు. అతనికి భారత్‌కి గట్టి విరోధం కలిగిన హఫీజ్ సయీద్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారతదేశంలో జరిగిన అనేక కీలక ఉగ్రదాడులలో అతడి పేరు ప్రస్తావించబడింది. సైఫుల్లా ఖలీద్ ఎల్లప్పుడూ లగ్జరీ కార్లలో ప్రయాణించడమే కాకుండా,అత్యాధునిక ఆయుధాలను తన వద్ద ఉంచుకుంటాడని సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సైనిక అధికారులు అతడిని సత్కరించి పూల వర్షం కురిపించేంతగా గౌరవిస్తారట.

వివరాలు 

భారత సైనికులను ఎంతమంది చంపితే.. అంత ఎక్కువ ప్రతిఫలం

పాకిస్థాన్ ఆర్మీ అతడిని తమ సైనికులను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తుందని సమాచారం ఉంది. ఈ ఉగ్రదాడికి కేవలం రెండు నెలల ముందే, సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని కంగన్‌పూర్ అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పాకిస్థాన్ బటాలియన్ ఉండగా, ఆ బటాలియన్‌కి చెందిన కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్ అతడిని జిహాదీ ప్రసంగం చేయమని ఆహ్వానించాడు. ఖలీద్ అక్కడికి రాగానే, అతడిపై స్వయంగా కల్నల్ పూల వర్షం కురిపించాడు. ఆ తరువాత ఖలీద్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ సైన్యంలో తీవ్ర భావోద్వేగాన్ని రేకెత్తించినట్లు సమాచారం. తన ప్రసంగంలో ఖలీద్, భారత సైనికులను ఎంతమంది చంపితే అల్లాహ్ అంత ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడని వ్యాఖ్యానించాడు.