ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్
రూ.2000 నోటును ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. పీటీపీ వార్తా సంస్థకు సోమవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గవర్నర్ దాస్ మాట్లాడారు. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి, చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ తిరిగి వచ్చాయని దాస్ చెప్పారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా, మే 19న సుమారు రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
2018-19లోనే రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపేసిన ఆర్బీఐ
నవంబర్ 2016లో డీమోనిటైజేషన్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే రూ.2,000 కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. రూ.2,000 నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కి ముందు జారీ చేయబడ్డాయి. చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ మార్చి 31, 2018 నాటికి గరిష్ట స్థాయి రూ.6.73 లక్షల కోట్ల నుంచి ₹3.62 లక్షల కోట్లకు తగ్గింది. ఇది మార్చి 31, 2023 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8 శాతం మాత్రమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018-19లోనే రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపేసింది.