Telangana: ప్రపంచంలోనే తొలి త్రివిధ సజ్జ హైబ్రిడ్ 'ఆర్హెచ్బీ-273' విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు కలిసి ప్రపంచంలోనే తొలిసారిగా త్రివిధ సజ్జ సంకర రకాన్ని అభివృద్ధి చేశాయి. దీనికి ఆర్హెచ్బీ-273 అనే పేరు పెట్టారు. ఈ కొత్త రకాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఇటీవల అధికారికంగా ఆవిష్కరించారు. సాధారణంగా హైబ్రిడ్ పంటలు రెండు మాతృకల ఆధారంగా రూపొందుతాయి. అయితే ఈ సజ్జ రకం మాత్రం మూడు మాతృకల కలయికతో తయారైన త్రివిధ హైబ్రిడ్ కావడం విశేషం. దీని వల్ల రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పశుగ్రాస లక్షణాలు లభిస్తాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్, ప్రధాన శాస్త్రవేత్త ఎస్.కే. గుప్తా మంగళవారం తెలిపారు.
వివరాలు
తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలకు అనుకూలం
ఈ త్రివిధ సజ్జ రకం ఏటా 400 మిల్లీమీటర్లకు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలకు అనుకూలంగా ఉందని వారు వివరించారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో సాగుకు ఇది ఎంతో అనుకూలమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ రకాన్ని మరింత మెరుగుపరచి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సజ్జ రకం సగటున హెక్టారుకు సుమారు 2,230 కిలోల దిగుబడి ఇస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.