LOADING...
Telugu Mahasabhalu 2026: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అన్నమయ్య కీర్తనలతో ప్రారంభం
నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అన్నమయ్య కీర్తనలతో ప్రారంభం

Telugu Mahasabhalu 2026: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అన్నమయ్య కీర్తనలతో ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా, మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రారంభ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్‌ రవీంద్రలు కలిసి ప్రారంభించనున్నారు. మహాసభల ప్రధాన వేదికతో పాటు ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు ఉపవేదికలపై సన్మాన కార్యక్రమాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు వంటి అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Details

ప్రజలకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యం

రాత్రి 11 గంటల వరకు వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు కొనసాగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్ తెలిపారు. ఇక, మహాసభల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కల్యాణాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో ప్రజలకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనతను ప్రతిబింబించేలా పురాతన సాహిత్య గ్రంథాలు, ప్రాచీన తెలుగు నాణేలు, సంప్రదాయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శనివారం సాయంత్రం నిర్వహించనున్న ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల ప్రదాన సభకు ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Details

ముఖ్య అతిథిగా మారిషన్ దేశాధ్యక్షుడు

ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.హెచ్‌. మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొననున్నారు. మహాసభల రెండో రోజు అయిన ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక సభలకు మారిషస్‌ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్‌ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. జయసూర్య, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు సహా పలువురు మంత్రులు పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం జరిగే కార్యక్రమాలకు త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Details

చివరి రోజు సీఎం హాజరయ్యే అవకాశం

మహాసభల చివరి రోజు అయిన సోమవారం ఉదయం జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. కాగా, నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే మూడో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణానికి ప్రముఖ గాయకులు డాక్టర్‌ ఘంటసాల, డాక్టర్‌ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పేర్లతో వేదికలకు నామకరణం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement