హిందీ దినోత్సవం: సెప్టెంబర్ 14న ఎందుకు జరుపుకుంటారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిందీ భాష వినియోగం పెంచడం, హిందీ భాషలో సేవలు చేస్తున్న వారిని గుర్తించి అభినందించే ఉద్దేశ్యంతో ఈరోజు జరుపుతున్నారు. ప్రస్తుతం హిందీ దినోత్సవం చరిత్ర, రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలుసుకుందాం. చరిత్ర: మొదటిసారిగా హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14వ తేదీన జరుపుకున్నారు. హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం, భారత ప్రభుత్వం హిందీని అధికార భాషగా గుర్తించడమే. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన, అధికార భాషగా భారత ప్రభుత్వం గుర్తించింది. అధికార భాషగా గుర్తింపబడిన రోజును హిందీ దినోత్సవంగా జరుపుకోవడం 1953నుండి మొదలైంది.
హిందీ మాట్లాడే ఇతర దేశాలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషను 600మిలియన్లకు పైగా జనాలు మాట్లాడతారు. 425మిలియన్ల మందికి హిందీ మాతృభాషగా ఉంది. 120మిలియన్ల మందికి రెండవ భాషగా హిందీ ఉంది. ఇండియాలోనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్, పంజాబ్ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు. ఇండియాలో కాకుండా మారిషస్, నేపాల్, ఫుజి, గయానా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టోబాగో దేశాల్లో హిందీ భాష మాట్లాడతారు.
భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు
భారత రాజ్యంగం మొత్తం 22భాషలను గుర్తించింది. అందులో, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో ఈ భాషలున్నాయి. సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, బంగ్లా, బోడో, డోగ్రీ, సంథాలీ, గుజరాతీ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సింధి, ఉర్దూ భాషలను రాజ్యాంగం గుర్తించింది.