Diwali 2025: దీపావళి రోజున హడావిడి లేకుండా సులభంగా చేసే 3 రకాల వంటలు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండగ అంటేనే.. సందడి సంబరాలు.. దీపాలు,రంగు రంగుల రంగవల్లులు, బాణా సంచా, పిండి వంటలు, ఇవన్నీ కలబోసిన వేడుకలకు వేదిక హిందూ సంప్రదాయ పండగలు. దీపావళి రోజున స్వీట్స్ తప్పనిసరిగా తయారు చేస్తారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వంటలకు వేదికగా దీపావళి పండగ ఉంటుంది. ఈ రోజు దీపావళి స్పెషల్ గా చిమ్మిలి పూర్ణాలు,మైసూర్ పాక్,మైదా గవ్వలు తయారీ గురించి తెలుసుకుందాం..
వివరాలు
మైదా గవ్వలు.. మైదా గవ్వలు..
మైదా పిండి - 1 కిలో
చక్కెర - 1 కిలో
ఉప్పు - తగినంత
బొంబాయి రవ్వ - 1 కేజీ
పాలు - 2 గ్లాసులు
నూనె - అర కిలో
తయారీ విధానం:
ముందగా మైదాపిండి,బొంబాయి రవ్వని జల్లెడ పట్టి అందులో సరిపడా ఉప్పు వేసి తరువాత పాలు పోయాలి.
దీన్ని గట్టిగా పూరీల పిండిలా కలుపుకుని పక్కన పెట్టాలి.గంటన్నర దాటిన తరువాత ఈ పిండిని గవ్వల చెక్క మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వేలితో వత్తాలి.
గవ్వలను సిద్ధం చేసుకున్న తరువాత స్టౌవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి కాగనివ్వాలి.తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వలను వేసి బాగా వేయించాలి.
వివరాలు
ముదురు పాకంలో గవ్వలు వేసి బాగా కలపాలి
గవ్వలు వేయించాక చక్కెరలో ఓ గ్లాసు నీళ్లువేసి ముదురు పాకం పట్టి అందులో ఆ గవ్వలను వేసి బాగా కలపాలి.అంతే రుచికరమైన గవ్వలు తయారైపోతాయి.
మైసూర్ పాక్- కావాల్సిన పదార్థాలు
శనగపిండి -2 గ్లాసులు
డాల్డా/ నెయ్యి -2 గ్లాసులు
చక్కెర - 2 గ్లాసులు
తయారీ విధానం:
ముందుగా శనగపిండిని జల్లెడ పట్టాలి. ఆ తరువాత స్టౌవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా డాల్డా/ నెయ్యి వేసి అడుగంటకుండా దోరగా వేయించుకోవాలి.
గిన్నెలో కొద్ది నీరు,చక్కెరను వేసి పాకం వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచాలి. పాకం తయారైన తరువాత దాంట్లో శనగ పిండి వేసి గట్టి పడే వరకు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.
వివరాలు
చదరంగా ఉండే ట్రేలో ఈ మిశ్రమాన్ని పోయాలి
వేడి చేసి పెట్టుకున్న డాల్డా/ నెయ్యి శనగపిండిలో పోయాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు పిండి గుల్లలుగా తయారవుతుంది. తరువాత మరోసారి డాల్డా/ నెయ్యి వేసి కలుపుకుని ఒక నలు చదరంగా ఉండే ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి చాకుతో ముక్కలుగా కోసుకుని 10 నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి.
దీంతో రుచికరమైన మైసూర్పాక్ సిద్ధం.
వివరాలు
చిమ్మిలి పూర్ణాలు- కావాల్సిన పదార్థాలు
నువ్వులు- కప్పు
బియ్యపు పిండి- కప్పు
బెల్లం- కప్పు
మైదా- టీస్పూన్
ఉప్పు- చిటికెడు
తయారీ విధానం: ముందుగా బియ్యపు పిండిలో మైదా, చిటికెడు ఉప్పువేసి నీళ్లుపోస్తూ చిక్కగా కలుపుకోవాలి. దీన్ని పావుగంటసేపు నాననివ్వాలి. తర్వాత స్టౌ వెలిగించి, కడాయి పెట్టి అందులో నువ్వులు వేయించాలి. చల్లారాక మిక్సీ పట్టించాలి. తర్వాత ఇందులో బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టించి, గిన్నెలో వేయాలి. తర్వాత చిమ్మిలిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని, బాణలిలో నూనె వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా సిద్దం చేసుకున్న పూర్ణం పిండిలో ముంచి వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన చిమ్మిలి పూర్ణాలు తయారవుతాయి.