Cerebral Palsy Day: ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. లక్షణాలు, చికిత్స మార్గాలను తెలుసుకోండి
ప్రపంచం మొత్తం ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డేను జరుపుకుంటోంది. అక్టోబర్ 6న ప్రతేడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీ. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇది ఒక నరాల వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.70 కోట్ల మందికి పైగా సెరిబ్రల్ పాల్సీ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి పుట్టుకతో సంబంధం ఉన్న కేసులకు, లేదా మస్తిష్కానికి గాయాలు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ కారణంగా మెదడులో ఎదుగుదల లోపం ఏర్పడుతుంది, తద్వారా కండరాలు, కదలికలపై సమన్వయం క్షీణించవచ్చు. ముఖ్యంగా బాల్యంలో ఈ వైకల్యం సాధారణంగా జన్యుపరమైన లోపాలు సంభవించే అవకాశం ఉంది.
ప్రతి 1,000 పిల్లల్లో ముగ్గరికి మస్తిష్క పక్షవాతం
భారతదేశంలో ప్రతి 1,000 పిల్లల్లో 3 మందికి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది సాధారణంగా ఆడపిల్లల కంటే మగపిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. మస్తిష్క పక్షవాతం లక్షణాలలో మూడు నెలల వయసులో శిశువును ఎత్తినప్పుడు తల వెనక్కి వాలిపోవడం, శరీరం బిగుసుకోవడం, కండరాల బలహీనత, ఆరు నెలల గడువు లోపు దొర్లకపోవడం, రెండు చేతులను కూడదీసుకోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ లక్షణాలు కండరాల భంగిమ, కదలికల నియంత్రణలో ఇబ్బందులకు దారితీస్తాయి. .
సకాలంలో వైద్యం అందిస్తే కొంతవరకు వ్యాధిని అరికట్టవచ్చు
మస్తిష్క పక్షవాతానికి కారణమయ్యే ముఖ్యమైన అంశాలలో గర్భధారణ సమయంలో రుబెల్లా వ్యాధి, శిశువుకు రక్త ప్రసరణలో ఆటంకం, ప్రసవ సమయంలో ఆక్సిజన్ కొరత ఉన్నాయి. ఈ వ్యాధి నయం చేయలేని స్థితిగా పరిగణించబడినా, మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలు బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. మస్తిష్క పక్షవాతం బారిన పడినవారికి సకాలంలో వైద్యం అందిస్తే కొంతవరకు ఈ వ్యాధిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు