చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక
చంద్రయాన్-3 వ్యోమనౌక లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేసింది. నాలుగో కక్ష్యలో భూమి చుట్టు తిరిగిన వ్యోమనౌక, తాజాగా 5వ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు మంగళవారం ఇస్రో ప్రకటించింది. బెంగళూరు నగరంలోని టెలీమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ నుంచి దీన్ని చేపట్టింది. చంద్రయాన్-3కి ఇదే చివరి కక్ష్య అని, తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని వివరించింది. ఆగస్టు 1న చివరి ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. జులై 14న LVM3-M4 రాకెట్ ద్వారా భూకక్ష్యలో ప్రవేశించిన చంద్రయాన్-3 కక్ష్యను దశలవారీగా అయిదుసార్లు ఇస్రో పెంచింది. దీంతో చంద్రయాన్ 3 చంద్రుడికి మరింత చేరువవుతోంది. 5వ భూకక్ష్య పూర్తైన తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి పయనిస్తుంది. ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది.