LOADING...
Elon Musk: ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌లింక్‌ .. ముంబైలో తొలి కార్యాలయం ఏర్పాటు
ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌లింక్‌ .. ముంబైలో తొలి కార్యాలయం ఏర్పాటు

Elon Musk: ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌లింక్‌ .. ముంబైలో తొలి కార్యాలయం ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో తన తొలి ఆఫీస్‌ ఏర్పాటు చేసింది. ముంబైలోని చాందివలీ ప్రాంతంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్‌ నివేదించింది. స్పేస్‌-X ఆధ్వర్యంలోని స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చాందివలీలోని బూమరాంగ్‌ కమర్షియల్‌ బిల్డింగ్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 1,294 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. ప్రాప్‌స్టాక్‌ ద్వారా లభించిన ప్రాపర్టీ పత్రాల ప్రకారం, ఈ ఒప్పందం అక్టోబర్‌ 14, 2025 నుండి అమల్లోకి రానుంది.

వివరాలు 

 గ్రామీణ, దూరప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేని చోట్ల సేవలు 

ఐదేళ్ల లీజ్‌ ఒప్పందం ప్రకారం, నెలకు ₹3.52 లక్షలు అద్దె, ప్రతి సంవత్సరం 5% పెరుగుదల ఉంటుందని, అలాగే ₹31.7 లక్షలు డిపాజిట్‌గా చెల్లించినట్లు నివేదికలో వెల్లడించారు. ఇది స్టార్‌లింక్‌ భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి కార్యాలయం. శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించాలనే సంస్థ ప్రణాళికలో భాగంగా ఈ అడుగు వేసింది. స్టార్‌లింక్‌, ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ కంపెనీకి చెందిన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్ల సాయంతో వేగవంతమైన, తక్కువ లేటెన్సీ ఉన్న ఇంటర్నెట్‌ను అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో మాత్రం గ్రామీణ, దూరప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేని చోట్ల సేవలు అందించడంపైనే దృష్టి సారిస్తోంది.

వివరాలు 

4జీ,5జీ నెట్‌వర్క్‌ల విస్తరణతో డిజిటల్‌ ఇండియా మరింత బలపడుతోంది

ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది గేట్‌వే ఎర్త్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో ఒకటి ముంబైలో ఉండనుంది. వీటి ద్వారా శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ దేశమంతా విస్తరించనుంది. ఇప్పటికే 850 మిలియన్లకు పైగా యూజర్లతో భారత్‌ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ మార్కెట్‌లలో ఒకటిగా నిలిచింది. డిజిటల్‌ ఇండియా, 4జీ,5జీ నెట్‌వర్క్‌ల విస్తరణతో ఈ రంగం మరింత బలపడుతోంది.

వివరాలు 

స్టార్‌లింక్‌కు భారత్‌లో యూనిఫైడ్‌ లైసెన్స్

గత జూలైలో స్టార్‌లింక్‌కు భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం యూనిఫైడ్‌ లైసెన్స్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా యూనియన్‌ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, స్పెక్ట్రమ్‌ కేటాయింపు, గేట్‌వే ఏర్పాట్ల కోసం చట్టపరమైన మార్గదర్శకాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సింధియా మాట్లాడుతూ.. "2014 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో ఇంటర్నెట్‌ సబ్‌స్క్రిప్షన్లు 286% పెరిగాయి, బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం 1,450% పెరిగింది" అన్నారు. అలాగే మొబైల్‌ డేటా ధరలు ₹8.9 ప్రతి GBకు తగ్గి, ప్రపంచంలోనే భారత్‌ను అతి తక్కువ డేటా ధరల మార్కెట్‌గా నిలిపాయని తెలిపారు.