Page Loader
Google: ఆండ్రాయిడ్ టీవీ వివాదానికి ముగింపు.. గూగుల్‌కు సీసీఐ కీలక ఆదేశాలు
ఆండ్రాయిడ్ టీవీ వివాదానికి ముగింపు.. గూగుల్‌కు సీసీఐ కీలక ఆదేశాలు

Google: ఆండ్రాయిడ్ టీవీ వివాదానికి ముగింపు.. గూగుల్‌కు సీసీఐ కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో గూగుల్ తీసుకున్న విధానాలు స్మార్ట్ టీవీ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయంటూ నెలకొన్న వివాదం చివరకు ముగింపు దశకు చేరుకుంది. దేశీయ స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ అనుసరిస్తున్న వ్యూహాలు సరైనవికావని భావించిన 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, ఆండ్రాయిడ్ ఆధారిత టీవీలలో డిఫాల్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్‌ను అందించే విధానాన్ని ఇకపై కొనసాగించరాదని గూగుల్‌కు స్పష్టమైన సూచనలివ్వడంతో, సంస్థ ఆ మార్పును అంగీకరించింది.

వివరాలు 

భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదుల ఫిర్యాదు 

భారత స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ అనుచితంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, పోటీని అడ్డుకుంటున్నట్లుగా సీసీఐ గుర్తించింది. గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' (TVADA) కింద తయారీ సంస్థలకు ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ ప్లే స్టోర్, ఇతర అప్లికేషన్లను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలన్న నిబంధనను విధించడం ద్వారా గూగుల్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేసిందని సీసీఐ తన విచారణలో తేల్చింది. ఈ వ్యవహారంపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు వేసిన ఫిర్యాదు ఆధారంగా సీసీఐ విచారణ మొదలుపెట్టింది. గూగుల్ చిన్న సంస్థలకు ప్రత్యామ్నాయ ఓపరేటింగ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడాన్ని అడ్డుకునేలా నిబంధనలు విధించిందని ఆరంభ దశలోనే వెల్లడైంది. దీంతో,గూగుల్ తన వైఖరిని మార్చక తప్పలేదు.

వివరాలు 

టీవీ తయారీదారులందరికీ ఒక అధికారిక లేఖ పంపించాలని సీసీఐ ఆదేశం 

సీసీఐ సూచనలతో గూగుల్ ఒక సెటిల్‌మెంట్ దరఖాస్తును దాఖలు చేసింది.ఈ దరఖాస్తు ప్రకారం, భారతదేశానికి ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం గూగుల్ తన ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా వేర్వేరుగా లైసెన్స్ చేయనుంది. ఈ మార్పు ద్వారా, ఇప్పటి వరకూ ఉచితంగా లభించిన ఈ సర్వీసులకు ఇకపై తయారీదారులు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో, గూగుల్ దేశవ్యాప్తంగా టీవీ తయారీదారులందరికీ ఒక అధికారిక లేఖ పంపించాలని సీసీఐ ఆదేశించింది. ఆ లేఖలో, వారు తప్పనిసరిగా గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదని, తమకు నచ్చిన ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేయాలని సూచించింది.

వివరాలు 

గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్‌ల్లో మాత్రం విస్తృతంగా యాప్‌లు

ఇకపై వినియోగదారులు కొత్త టీవీ కొనుగోలు చేసే ముందు, అందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ యాప్ స్టోర్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు,యాప్ స్టోర్‌లు కూడా టీవీ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని యాప్ స్టోర్‌లలో అన్ని యాప్‌లు లభ్యమయ్యే పరిస్థితి లేదు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్‌ల్లో మాత్రం విస్తృతంగా యాప్‌లు లభిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ డెవలపర్లు ఎక్కువగా గూగుల్, ఆపిల్, అమెజాన్ స్టోర్‌లపైనే దృష్టి సారిస్తున్నారు.

వివరాలు 

సెటిల్‌మెంట్‌లో భాగంగా గూగుల్ రూ.20 కోట్లు లేదా 2.38 మిలియన్ డాలర్లు జరిమానా

ఈ కొత్త ఒప్పందం ప్రకారం, భారతదేశంలోని టీవీ తయారీదారులు గూగుల్ యాప్‌లను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాల్సిన నిబంధన లేకుండానే, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎంచుకునే అవకాశాన్ని పొందారు. ప్రస్తుతం ఈ మార్పులు స్మార్ట్ టీవీలకే పరిమితమవుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఇతర డివైజ్‌లకూ ఈ విధానం విస్తరించవచ్చని సీసీఐ సూచించింది. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా గూగుల్ రూ.20 కోట్లు లేదా 2.38 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని తేలింది. ఈ కేసుతో, స్మార్ట్ టీవీ రంగంలో పోటీ ప్రాతిపదికన సమర్థవంతమైన మార్పులకు బీజం పడనుంది.