
Digital Frauds: సైబర్ నేరాలకు ఉపయోగించే సిమ్ కార్డులు,వేల వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేసిన కేంద్రం!
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
అమాయక ప్రజలను మోసం చేసి వారి ఆస్తులను కాజేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా మారింది.
అయితే,ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ లోక్సభలో తెలిపారు.
ఇప్పటికే డిజిటల్ మోసాలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించారు.
లోక్సభలో అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానమిస్తూ,నకిలీ పత్రాల ఆధారంగా సిమ్ కార్డులు పొందుతూ డిజిటల్ మోసాలకు పాల్పడే వారి ఆగడాలను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని తెలిపారు.
వివరాలు
2,08,469 ఐఎమ్ఈఐ నంబర్ల బ్లాక్
2024 ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులతో పాటు, 83 వేల వాట్సాప్ ఖాతాలను కూడా నిలిపివేశామని వెల్లడించారు.
భారత ప్రభుత్వం మొత్తం 2,08,469 ఐఎమ్ఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.
ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (IMEI) అనేది ప్రతి మొబైల్ ఫోన్కు ప్రత్యేకంగా కేటాయించే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆధ్వర్యంలో 3,962 పైగా స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ముందుగానే గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపారు.
సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS)ను 2021లో ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు.
వివరాలు
13.36 లక్షల ఫిర్యాదులు
ఇప్పటి వరకు 13.36 లక్షల ఫిర్యాదులు అందాయని, ఈ చర్యల వల్ల దాదాపు రూ.4,386 కోట్లను కాపాడగలిగామని వివరించారు.
ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరిగే డిజిటల్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
డిజిటల్ మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ప్రారంభించామని, ఈ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, తదనుగుణంగా సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని వివరించారు.