Adam Mosseri: ఇన్స్టాగ్రామ్లో 'ట్యాప్ టు పాజ్' ఫీచర్.. రీల్స్ వీక్షణలో కొత్త అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరో కీలకమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు రీల్స్ చూస్తున్నప్పుడు వీడియోను మధ్యలో ఆపాలంటే స్క్రీన్పై నొక్కి పట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం పూర్తిగా తొలగిపోయింది. కేవలం ఒక్కసారి స్క్రీన్ను టచ్ చేస్తే చాలు, వీడియో వెంటనే పాజ్ అవుతుంది. ఈ కొత్త 'ట్యాప్-టు-పాజ్' ఫీచర్ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సెరి వెల్లడించారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వీడియోలోని క్యాప్షన్లు చదవడం, లేదా ఏదైనా అంశాన్ని స్పష్టంగా గమనించడం మరింత సులభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగదారులకు కంటెంట్పై మరింత నియంత్రణ కల్పించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వివరాలు
క్రియేటర్ల కోసం కొత్త ఏఐ ఫీచర్లు
వీడియోను పాజ్ చేసినప్పుడు 'మ్యూట్' ఆప్షన్ కూడా కనిపించేలా సదుపాయం కల్పించారు. ఈ అప్డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుతోంది. ఈ మార్పుతో పాటు, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా పరిచయం చేస్తోంది. 'వాయిస్ ఎఫెక్ట్స్' పేరుతో రోబోట్, ఏలియన్ వంటి మొత్తం ఎనిమిది రకాల ఆడియో ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా, "క్రియేట్ మై లైక్నెస్" అనే పేరుతో ఒక కొత్త ఏఐ ఫేస్ స్వాప్ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ముఖ కవళికలను ఆధారంగా చేసుకుని ఏఐ చిత్రాలు, వీడియోలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
గోప్యతపై ఆందోళనలు
అయితే, ఈ ఏఐ ఫేస్ స్వాప్ ఫీచర్పై టెక్ నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, యూజర్ల ముఖానికి సంబంధించిన డేటాను సేకరించడం గోప్యతకు ముప్పు కలిగించే అవకాశముందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మెటా సంస్థ, వినియోగదారుల అనుమతి లేకుండా ఎలాంటి డేటా వినియోగం జరగదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తామని వెల్లడించింది.