నేడు కక్ష్యలోకి ఎన్వీఎస్ -01 ఉపగ్రహం
నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్ -01 ను ఇస్రో సోమవారం ప్రయోగించనుంది. నావిగేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రయోగంలో భాగంగా ఈ ఉపగ్రహాన్ని పంపనున్నట్లు ఇస్రో తెలిపింది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్ వీ ఎఫ్ 12 వాహన నౌక ద్వారా ఎన్వీఎస్-01ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటల పాటు కొనసాగిన తర్వాత షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి వెళ్లనుంది.
ఈ ఉపగ్రహం జీవిత కాలం 12 ఏళ్లు
జీఎస్ఎల్వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులుగా ఉంది. రాకెట్ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని జీవిత కాలం 12 ఏళ్లు. సాయుధ బలగాలతో పాటు సాధారణ యూజర్లకూ ఈ నెట్ వర్క్ నావిగేషన్ సేవలు అందిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగంలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని నావిక్ సిస్టంను అభివృద్ధి చేశారు. ఉపగ్రహం భారత ప్రధాన భూభాగం చూట్టూ సూమారు 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పోజిషనింగ్ సేవలు అందిస్తుంది.