Atlantic ocean: 74 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన పాన్ యామ్ విమాన శకలాలు.. అట్లాంటిక్లో గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఏడు దశాబ్దాలకు పైగా అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన పాన్ యామ్ విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 1952లో ప్యూర్టో రికో తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైన పాన్ యామ్ విమాన శకలాలను అట్లాంటిక్ మహాసముద్రం అడుగున గుర్తించినట్లు ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ వెల్లడించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూన్ 2న నిర్వహించిన అన్వేషణలో సముద్ర మట్టానికి దాదాపు 2,000 అడుగుల లోతులో ఈ విమాన శకలాలు లభించాయి. విమానం రెండు పెద్ద భాగాలుగా విరిగి సముద్ర గర్భంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో మొత్తం 69 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
వివరాలు
అత్యవసర పరిస్థితుల్లో సముద్రంపై ల్యాండ్..
ఈ శకలాల గుర్తింపులో అత్యాధునిక హై-రిజల్యూషన్ సోనార్ సాంకేతికతతో పాటు అటానమస్ అండర్వాటర్ వెహికల్ (సముద్ర అంతర్భాగంలో పనిచేసే స్వయంచాలక వాహనం) కీలక పాత్ర పోషించాయి.
ఈ దుర్ఘటనలో మొత్తం 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాన్ని గుర్తించేందుకు డిస్కవరీ ఛానెల్కు చెందిన 'ఎక్స్పెడిషన్ అనౌన్' బృందం, 'డీప్ సీ విజన్' సంస్థలు అనేక సంవత్సరాలుగా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాయి.
'క్లిప్పర్ ఎండీవర్' పేరుతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లలో లోపం తలెత్తింది.
దీంతో పైలట్ అత్యవసర పరిస్థితుల్లో సముద్రంపై విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
వివరాలు
భద్రతా సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు..
ఆ సమయంలో ప్రమాదం కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
అయితే, అనంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియలో సరైన సమన్వయం లేకపోవడం, సమాచార లోపం, భాషా అవరోధాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి.
ఈ పరిణామాల మధ్య విమానంలోకి నీరు వేగంగా చేరి, కేవలం మూడు నిమిషాల్లోనే అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది.
ఈ ఘటన తర్వాతే విమాన భద్రతా విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం ప్రతి విమానం టేకాఫ్కు ముందు ఫ్లైట్ అటెండెంట్లు ప్రయాణికులకు అందించే సేఫ్టీ బ్రీఫింగ్ విధానం ఈ ప్రమాదం అనంతరం అమల్లోకి వచ్చింది.
అనంతరం సివిల్ ఏరోనాటిక్స్ బోర్డు ఈ భద్రతా సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
వివరాలు
పరిశోధకులు ఏం చెప్పారంటే..
ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు రస్ మాథ్యూస్ పాత ప్రమాద నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం 2019లో శాన్ జువాన్ తీర ప్రాంతంలో పలు సర్వేలు చేపట్టారు.
అనంతరం 'ఎక్స్పెడిషన్ అనౌన్' బృందంతో కలిసి నిర్వహించిన అన్వేషణలో కీలక ఆధారాలు లభించాయి.
యూఎస్ ఎయిర్ఫోర్స్ పైలట్లు రూపొందించిన పాత మ్యాప్ను ఆధారంగా తీసుకుని, పరిశోధనా నౌక సాయంతో అండర్వాటర్ డ్రోన్ను వినియోగించగా తొలి ప్రయత్నంలోనే విమాన శకలాలను గుర్తించగలిగారు.
లభించిన చిత్రాల్లో పాన్ అమెరికన్ లోగోతో పాటు విమానం పేరు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.