
ENG vs IND : ఇంగ్లండ్పై ఘన విజయం… డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఎగబాకిన స్థానం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్తో 2025-27 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్కు శ్రీకారం చుట్టింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగు స్థానాలు ఎగబాకి ప్రస్తుతానికి మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ సైకిల్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా రెండింటినీ గెలిచి 100 శాతం విజయశాతం, 24 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో శ్రీలంక జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. లంక రెండు మ్యాచ్ల్లో ఒకదానిలో విజయం సాధించగా, మరొకటి డ్రా అయ్యింది. ఫలితంగా 66.67 శాతం విజయశాతం, 16 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.
Details
నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్
భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడి ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. దీంతో భారత్ ఖాతాలో 50 శాతం విజయశాతం, 12 పాయింట్లు ఉన్నాయి. ఇదే సంఖ్యలో పాయింట్లు, విజయశాతం ఉన్న ఇంగ్లాండ్ జట్టు భారత్ చేతిలో రెండో టెస్టులో ఓటమిపాలై నాలుగో స్థానానికి చేరింది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి డ్రా కాగా, మరొకటి ఓటమిగా ముగిసింది. దీంతో 16.67 శాతం విజయశాతం, నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన వెస్టిండీస్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఈ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ను కూడా ఆడలేదు.