LOADING...
Team India: వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే చాలు.. సెమీస్‌కు భారత్ టికెట్ గ్యారెంటీ!
వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే చాలు.. సెమీస్‌కు భారత్ టికెట్ గ్యారెంటీ!

Team India: వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే చాలు.. సెమీస్‌కు భారత్ టికెట్ గ్యారెంటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా సెమీఫైనల్‌ అవకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు సెమీస్‌ చేరాలంటే భారీ విజయమే మార్గమని విశ్లేషణలు వినిపించాయి. పరిస్థితి క్లిష్టంగా కనిపించింది. అయితే గ్రూప్‌ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది దక్షిణాఫ్రికా విజయం. వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా గ్రూప్‌లో ఆధిపత్యం చాటింది. అనంతరం జింబాబ్వేపై భారత్‌ విజయం సాధించడంతో దక్షిణాఫ్రికా సెమీస్‌ బెర్తు ఖరారైంది. నాలుగు పాయింట్లతో ఆ జట్టు నాకౌట్‌ దశకు చేరుకుంది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పొందిన జింబాబ్వే సెమీస్‌ రేసు నుంచి తప్పుకుంది.

Details

ఆదివారం టీమిండియా, విండీస్ మధ్య మ్యాచ్

ఇక ఆదివారం భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగే మ్యాచ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ను తలపిస్తోంది. ఆ పోరులో విజయం సాధించిన జట్టే రెండో సెమీస్‌ టికెట్‌ను దక్కించుకుంటుంది. ప్రస్తుతం రన్‌రేట్‌ ప్రభావం కనిపించకపోయినా, ఫలితం స్పష్టంగా రావడం కీలకం. అయితే ఆదివారం మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి మారిపోతుంది. అప్పుడు భారత్‌, విండీస్ రెండూ మూడు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఆ సందర్భంలో నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. మెరుగైన రన్‌రేట్‌ (1.791) కలిగిన వెస్టిండీస్‌ ముందంజ వేస్తుంది. భారత్‌ మాత్రం (-0.100) రన్‌రేట్‌తో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది.

Advertisement