ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనమతి ఇవ్వండి.. ప్రధానికి ఫుట్బాల్ కోచ్ లేఖ
ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు భారత ఫుట్ బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన లేఖను విడుదల చేశారు. ఆసియా క్రీడలకు అనుమతి ఇస్తే త్రివర్ణ పతాకం కోసం పోరాడుతామని ప్రధాని, కేంద్రమంత్రికి ఫుట్ బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ విజ్ఞప్తి చేశారు. పోటీల్లో భారత ఆటగాళ్లు పూర్తి శక్తితో ఆడతారని, అదే విధంగా దేశం కోసం ఆసియా క్రీడల్లో ప్లేయర్లు ఆడాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
చైనా వేదికగా ఆసియా క్రీడలు
ఇటీవల భారత ఫుట్బాల్ జట్టు ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుందని, జాతీయ జట్టుగా గత నాలుగేళ్లలో ఎన్నో విజయాలు సాధించామని ఇగోర్ స్టిమాక్ తెలిపారు. అందరి సహకారంతో మరింత మెరుగ్గా రాణించి ఆసియా క్రీడల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఫుట్ బాల్ ప్రపంచం తరుపున, భారత ఫుట్ బాల్ జట్టును ఆసియా గేమ్స్ లో పాల్గొనడానికి అనుమతించాలని కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనా వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.