Loading...
Babar Azam: మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇస్తేనే టెస్టు పగ్గాలు.. పీసీబీకి బాబర్ ఆజం షరతు!
మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇస్తేనే టెస్టు పగ్గాలు.. పీసీబీకి బాబర్ ఆజం షరతు!

Babar Azam: మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇస్తేనే టెస్టు పగ్గాలు.. పీసీబీకి బాబర్ ఆజం షరతు!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కెప్టెన్సీ మార్పులపై మరోసారి చర్చ మొదలైంది. టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి వచ్చిన ప్రతిపాదనకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఒక కీలక నిబంధనను ముందుంచినట్లు సమాచారం. టెస్టులతో పాటు వన్డే, టీ20 ఫార్మాట్లకు కూడా తననే కెప్టెన్‌గా నియమిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని బాబర్ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్ నాయకత్వంలో పాకిస్థాన్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.

వివరాలు

మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం..

డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన 16 టెస్టుల్లో 12 మ్యాచ్‌ల్లో జట్టు పరాజయం పాలవడంతో అతడి నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి.

ఈ పరిస్థితుల్లోనే సెలెక్షన్ కమిటీ మళ్లీ బాబర్ ఆజంను సంప్రదించినట్లు తెలుస్తోంది.

జులై 5న కొత్త టెస్టు కెప్టెన్‌ను ప్రకటించే ముందు ఇద్దరు సెలెక్టర్లు బాబర్‌ను కలిసి ఈ అంశంపై చర్చించగా, ఆ సందర్భంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అంశాన్ని ఆయన షరతుగా పేర్కొన్నట్లు సమాచారం.

బాబర్ ప్రతిపాదనకు స్పందించిన సెలెక్టర్లు.. రాబోయే వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల్లో జరిగే మొత్తం ఐదు టెస్టుల్లో జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే, మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు చెబుతున్నాయి.

వివరాలు

అన్ని ఫార్మాట్ల నాయకత్వం నుంచి తప్పుకున్న బాబర్..

అంతకుముందు టెస్టు జట్టు నాయకత్వాన్ని స్వీకరించాలని సల్మాన్ ఆఘాను సంప్రదించగా, ఆయన మర్యాదపూర్వకంగా ఆ బాధ్యతలను తిరస్కరించినట్లు సమాచారం.

2023 నవంబర్‌లో బాబర్ ఆజం అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో అప్పటి పీసీబీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ కేవలం టెస్టు జట్టుకు మాత్రమే కెప్టెన్‌గా కొనసాగాలని సూచించినప్పటికీ, బాబర్ అందుకు అంగీకరించకుండా అన్ని ఫార్మాట్ల నాయకత్వం నుంచి తప్పుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఏమన్నాడంటే..

ఇప్పుడు పరిస్థితులు మారడంతో మళ్లీ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తి ఆయనలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పాకిస్థాన్ వన్డే జట్టుకు షహీన్ అఫ్రిది, టీ20 జట్టుకు సల్మాన్ ఆఘా కెప్టెన్లుగా కొనసాగుతున్నారు.

అయితే వారి నాయకత్వంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో త్వరలోనే బాబర్ ఆజం మళ్లీ పాకిస్థాన్ జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అభిప్రాయపడ్డాడు.

ADVERTISEMENT