Champions Trophy: ఇంగ్లండ్కు ఊహించని షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ తొలి మ్యాచ్లో ఓటమిపాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
జట్టు బౌలింగ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు.
ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో కార్స్ ఎడమ కాలికి గాయమైంది.గాయం తీవ్రంగా ఉండటంతో,ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని సూచించింది.
దీంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు.అతని స్థానాన్ని లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్తో భర్తీ చేశారు.
"బ్రైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీనుంచి వైదొలిగాడు.అతని స్థానంలో లీసెస్టర్షైర్, ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్రౌండర్ రెహాన్ అహ్మద్ను జట్టులోకి తీసుకున్నాం"అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
వివరాలు
జట్టులోకి రెహాన్ అహ్మద్
ఇప్పటికే రెహాన్ అహ్మద్, ఇంగ్లండ్ జట్టుతో స్టాండ్బై ఆటగాడిగా ఉన్నాడు. కార్స్ గాయం కారణంగా అతడికి ప్రధాన జట్టులో అవకాశం దక్కింది.
అహ్మద్ అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. అతన్ని జట్టులోకి చేర్చడం ద్వారా ఇంగ్లండ్ స్పిన్ విభాగం మరింత బలపడనుంది.
ఇప్పటి వరకు స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆదిల్ రషీద్ మాత్రమే జట్టులో ఉన్నాడు.
అంతేకాకుండా, అహ్మద్ బ్యాటింగ్లోనూ రాణించగలడు. అహ్మద్ తన వన్డే కెరీర్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి, పది వికెట్లు తీసుకున్నాడు.
వివరాలు
ఇంగ్లండ్కు కీలక పోరు!
ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడగా, 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఇప్పుడు బట్లర్ సేన ఫిబ్రవరి 26న అఫ్గానిస్తాన్తో తలపడనుంది. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్