Ruturaj Gaikwad : ఆ రెండు ఓవర్లే మ్యాచ్ను మలుపు తిప్పాయి.. ఓటమికి కారణం చెప్పిన రుతురాజ్ గైక్వాడ్
ఈ వార్తాకథనం ఏంటి
సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరికి 184/8 స్కోరు వద్దే ఆగిపోయింది. మొదటి పది ఓవర్లలోనే వందకు పైగా పరుగులు సాధించినప్పటికీ, ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోవడంపై సీఎస్కేపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ఫరాజ్, డెవాల్డ్ బ్రెవిస్, షార్ట్, దూబే తక్కువ సమయంలోనే ఔటవడంతో జట్టు దెబ్బతిన్నది. మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారు. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం ఆ రెండు కీలక ఓవర్లేనని రుతురాజ్ పేర్కొన్నారు.
వివరాలు
అక్కడే విఫలమయ్యాం..
"195 పరుగుల లక్ష్యం పెద్ద సవాలు కాదు. సాధారణంగా చేరుకునే టార్గెట్. సన్రైజర్స్ పవర్ ప్లేను చూసినప్పుడు వారి స్కోరు 230 దాటుతుందని అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా ప్రదర్శించి స్కోరును కట్టడి చేశారు. అందువల్ల 200 లోపు లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తామని అనుకున్నాం. ఒక దశలో చివరి పది ఓవర్లలో కేవలం 80 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. కానీ ఆ సమయంలో వరుసగా రెండు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులే సాధించగలిగాం. భాగస్వామ్యాలు కొనసాగించాల్సిన చోట అక్కడే విఫలమయ్యాం. అదే మ్యాచ్ మలుపు తిప్పింది. డెత్ ఓవర్లలో 12 రన్రేట్తో పరుగులు చేయడం సులభం కాదు. ఈ విజయానికి సన్రైజర్స్ బౌలర్లకే క్రెడిట్ ఇవ్వాలి" అని రుతురాజ్ వివరించాడు.
వివరాలు
బౌలింగ్లో సమస్యలేమీ లేవన్న కెప్టెన్
చెన్నై ఇన్నింగ్స్లో 11వ ఓవర్ వేసిన ఇషాన్ మలింగ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. 12వ ఓవర్లో శివాంగ్ కూడా మూడు పరుగులకే పరిమితం చేశాడు. ఈ రెండు ఓవర్ల తర్వాత రన్రేట్ భారీగా పెరిగింది. చివరి దశలో కూడా సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో చెన్నై బ్యాట్స్మెన్ను అదుపులో ఉంచారు. "గత మూడు మ్యాచ్లలో మా బౌలర్లు చాలా బాగా ప్రదర్శించారు. అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. మేమెక్కడా నాసిరకం బంతులు వేయలేదు. పవర్ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాం. డెత్ ఓవర్లలో అన్షుల్ కీలక పాత్ర పోషించాడు. అతను తన ప్రణాళికలను స్పష్టంగా అమలు చేసే బౌలర్. రోజురోజుకీ అతని ప్రదర్శన మెరుగవుతోంది" అని రుతురాజ్ తెలిపారు.