ICC - Ashwin: ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనలతో స్పిన్నర్లకు ఇబ్బందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.
తక్షణమే ఈ నిబంధనలను తొలగించి, లేకపోతే వన్డే క్రికెట్ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
ఇటీవల జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల గురించి కూడా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Details
వన్డే క్రికెట్ భవిష్యత్తుపై అశ్విన్ ఆందోళన
అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్కి ముందు తాను వన్డే ఫార్మాట్ గురించి ఆలోచించానని, వన్డేలకు భవిష్యత్తు ఉందా అనే సందేహం కలిగిందన్నారు.
ఎందుకంటే, టీ20లు తక్కువ సమయంలో ఫలితాన్ని ఇస్తుండటంతో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోందన్నారు.
టెస్టు క్రికెట్కూ మంచి స్పందన వస్తోందని, అఫ్గానిస్థాన్ వంటి జట్లు తమ దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకొస్తే, టెస్టులు మరింత ఆసక్తికరంగా మారతాయని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
Details
స్పిన్నర్లకు నష్టం, బ్యాటర్లకు ప్రయోజనం
2013-14 వరకు వన్డేల్లో ఒక్కే బంతితో ఇన్నింగ్స్ సాగేదని, కానీ ఇప్పుడు రెండు కొత్త బంతులు తీసుకురావడంతో పాటు ఫీల్డింగ్ సర్కిల్లో ఐదుగురు మాత్రమే ఉండేలా ఐసీసీ నిబంధనలు మార్చింది.
అప్పటి నుంచి స్పిన్నర్ల ప్రాధాన్యత తగ్గిపోయిందని, ఇది భారత స్పిన్ సంస్కృతిని దెబ్బతీసేందుకు తీసుకొచ్చిన మార్పులా అనిపిస్తోందన్నారు.
ముఖ్యంగా రివర్స్ స్వింగ్ కనుమరుగైపోయిందని అశ్విన్ వ్యాఖ్యానించారు.
Details
2027 వన్డే ప్రపంచకప్ నిర్వహణ కఠిన పరీక్షే
2027 వన్డే ప్రపంచకప్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నారు. అయితే, ఈ టోర్నీని నిర్వహించడం ఐసీసీకి పెద్ద సవాలే. వన్డే ఫార్మాట్కి ఇప్పుడు స్థానం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ, అఫ్గానిస్థాన్ - ఇంగ్లండ్ మ్యాచ్లో అఫ్గాన్ అద్భుత ప్రదర్శన చేసి పోటీలను రసవత్తరంగా మార్చింది.
వన్డేలకు భవిష్యత్తు ఉండాలంటే, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అశ్విన్ అన్నారు.