
Asia cup: ముంబయిలో భారీ వర్షాలు.. ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన ఆలస్యం!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమవుతుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రభావం ఆసియా కప్లో పాల్గొనబోయే భారత జట్టు ప్రకటనపై కూడా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 1:30 గంటలకు జట్టును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా జరగాల్సిన విలేకరుల సమావేశం ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇప్పటికే బీసీసీఐ (BCCI) కార్యాలయానికి చేరుకున్నారు.
Details
తొలి మ్యాచులో యూఏఈతో తలపడనున్న భారత్
మిగతా సభ్యులు హాజరైన తర్వాతే సమావేశం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ముంబయిలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇక ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ మొత్తం టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఆఫ్గానిస్థాన్-హాంకాంగ్ మధ్య మ్యాచ్తో టోర్నీ ఆరంభమవుతుంది. భారత జట్టు తన తొలి పోరును సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.