
ICC: ఐసీసీ మరో కీలక నిర్ణయం.. మహిళల వన్డే వరల్డ్ కప్ లో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలూ మహిళలే
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి మహిళలతో కూడిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్ను ఏర్పాటు చేసి, మహిళల మెగా ఈవెంట్ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గడచిన మహిళల టీ20 వరల్డ్ కప్, 2022 కామన్వెల్త్ గేమ్స్లలో ఐసీసీ (ICC) మహిళా అంపైర్లను, రిఫరీలను నియమించింది. అయితే వరల్డ్ కప్లో మాత్రం ఇదే మొదటి సారి. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక ఉమ్మడి ఆతిథ్యంలో జరగనుంది. మొత్తం 14 మంది అంపైర్లు, 4 మంది మ్యాచ్ రిఫరీలు ఈ ప్యానెల్లో తమ సేవలు అందించనున్నారు.
వివరాలు
అంపైర్లలో చాలామంది క్రికెట్ అభిమానులకు సుపరిచతమే
అంపైర్లలో చాలామంది క్రికెట్ అభిమానులకు సుపరిచతమైన వారే ఉన్నారు. క్లైర్ పోలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్ఫెర్న్ కు ఇది మూడో మహిళల ప్రపంచ కప్. అలాగే, లారెన్ అగెన్బాగ్, కిమ్ కాటన్ రెండోసారి ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. మ్యాచ్ రిఫరీ ప్యానెల్ అనుభవజ్ఞులైనవారు, కొత్తవారితో సమతూకంగా ఉంది. ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా వంటి సభ్యులు ఈ ప్యానెల్లో ఉన్నారు.
వివరాలు
ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో ఒక అద్భుత ఘట్టం: జైషా
ఐసీసీ (ICC) చైర్మన్ జైషా ఈసారి పూర్తి మహిళా అంపైర్లు, రిఫరీలతో నిర్వహించనున్న మెగా టోర్నీని చరిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. "ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ముందడుగు కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. పూర్తిగా మహిళలతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేయడం కేవలం ఘట్టం మాత్రమే కాదు, క్రికెట్లో లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి ఐసీసీ చూపుతున్న నిబద్ధతకు ప్రతీక" అని జైషా పేర్కొన్నారు.