Page Loader
U19 Womens T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు.. వరుసగా నాలుగో విజయం
టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు.. వరుసగా నాలుగో విజయం

U19 Womens T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు.. వరుసగా నాలుగో విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్, ఆదివారం సూపర్ సిక్స్‌ గ్రూప్-1లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 64/8 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా, ఈ స్వల్ప లక్ష్యాన్ని 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో తెలుగమ్మాయి గొంగడి త్రిష (40; 31 బంతుల్లో 8 ఫోర్లు) అద్భుత ప్రదర్శనతో మెరిసింది. భారత్ విజయం సమీపానికి రాగానే త్రిష ఔటైంది. సానికా చల్కే (11*), నిక్కీ ప్రసాద్ (5*)లు నాటౌట్‌గా నిలిచారు.

Details

జనవరి 28న స్కాట్లాండ్ తో తలపడనున్న భారత్

నిక్కీ ప్రసాద్ విన్నింగ్ షాట్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించింది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన కమలిని కేవలం 3 పరుగులకే వెనుదిరిగింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సుమైయా అక్తర్ (21*) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. జన్నాటుల్‌ మౌవా 14 పరుగులు చేసింది. ఫహోమిదా చోయా (2), ఎవా (2), సాదియా ఇస్లామ్‌ (5), అశిమా (7), నిశిత (6) సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు తీయగా, షబ్నమ్‌, జోషిత, త్రిష తలో వికెట్‌ సాధించారు. ఈ విజయంతో భారత్ సూపర్ సిక్స్‌ గ్రూప్‌-1లో తనస్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. తర్వాతి మ్యాచ్‌లో (జనవరి 28) భారత్ స్కాట్లాండ్‌తో తలపడనుంది.