Shubman Gill: గాయపడ్డ శుభ్మన్ గిల్.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేరికకు తేదీ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా (Team India) కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill) కోల్కతా టెస్ట్లో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతను రెండో టెస్ట్తో పాటు వన్డే సిరీస్కు కూడా దూరమవ్వాల్సి వచ్చింది. ఫలితంగా గువాహటి టెస్ట్కు రిషబ్ పంత్ బాధ్యతలు స్వీకరించగా, దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల కోసం కెఎల్ రాహుల్ను కెప్టెన్గా బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గిల్, సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్కు ఒక వారం ముందు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చేరుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్లో అతను అందుబాటులో ఉంటాడా అన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు.
Details
మొదటి టెస్టులో గాయపడ్డ గిల్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ చేస్తుండగా గిల్కు మెడ నొప్పి తీవ్రంగా వేధించింది. సైమన్ హార్మర్ వేసిన 35వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో అతని మెడ కండరం పట్టేయడంతో వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. నొప్పి కారణంగా అతను మైదానాన్ని వదలి వెళ్లక తప్పలేదు. అనంతరం రాత్రంతా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, మరుసటి రోజు డిశ్చార్జీ అయ్యాడు. ఈ గాయం వర్క్లోడ్తో సంబంధం లేదని, నిద్రలేమి కారణంగా కండరం పట్టేసిందని టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టం చేశారు.