
The Hundred League: ది హండ్రెడ్ లీగ్లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రూ.3,257 కోట్ల పెట్టుబడులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగుల్లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రవేశిస్తున్నాయి.
ఇప్పటికే సౌతాఫ్రికా 20 లీగ్, సీపీఎల్, ఎంఎల్సీ లాంటి టోర్నమెంట్లలో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలు ఉన్నాయి.
తాజాగా, ఇంగ్లండ్కు చెందిన 'ది హండ్రెడ్' లీగ్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం.
ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు కలిపి సుమారు రూ.3,257 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. దాదాపు 30% వాటాను ఈ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
వివరాలు
పాకిస్థాన్ క్రికెటర్లకు 'ది హండ్రెడ్' లీగ్లో ఆడే అవకాశం ఉంటుందా?
ఇప్పుడిదే విషయంపై ప్రధానంగా అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న ఏమిటంటే - పాకిస్థాన్ క్రికెటర్లకు 'ది హండ్రెడ్' లీగ్లో ఆడే అవకాశం ఉంటుందా? లేకపోతే ఐపీఎల్లో ఉన్నట్లుగానే వారిపై ఏమైనా నిషేధం ఉంటుందా?
కారణం, ఐపీఎల్లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎలాంటి అనుమతి లేదు.
అంతే కాదు, సౌతాఫ్రికా 20 లీగ్లో ఇప్పటివరకు ముగిసిన మూడు సీజన్లలోనూ ఒక్క పాక్ ప్లేయర్ కూడా కనిపించలేదు.
అయితే, 'ది హండ్రెడ్' లీగ్లో మాత్రం ఈ పరిస్థితి ఉండకపోవచ్చని ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ తెలిపారు.
వివరాలు
ఓవర్సీస్ బ్రాడ్కాస్ట్ హక్కులు మరింత పెరుగుతాయి
"ఇతర లీగుల్లో పరిస్థితి ఎలా ఉన్నా, ఇక్కడ మాత్రం భిన్నంగా ఉంటుంది. భారత టీవీ మార్కెట్తో పోలిస్తే మా ప్రధాన లక్ష్యం ఓవర్సీస్ మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇన్వెస్టర్లు మా లీగ్లో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల ఇన్వెస్ట్మెంట్ మా లీగ్కు అదనపు విలువ తీసుకొస్తుంది. ఓవర్సీస్ బ్రాడ్కాస్ట్ హక్కులు మరింత పెరుగుతాయి. భారత క్రికెటర్లు 'ది హండ్రెడ్' లీగ్లో ఆడలేరు. బీసీసీఐ దీనిపై స్పష్టమైన నిబంధనలు పెట్టింది. కానీ, టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా ఈ లీగ్లో పాల్గొనాల్సిందిగా మేం కోరుకుంటున్నాం. ప్రస్తుతం వాళ్లు కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం" అని గౌల్డ్ వెల్లడించారు.